ఎప్పుడు మాట్లాడినా జైలుకు పంపిస్తామంటున్నారు... వీళ్లకు జైలంటే ఇష్టమేమో!: అశోక్ గజపతిరాజు

  • మాన్సాస్ ట్రస్టు అంశాలపై మాట్లాడిన అశోక్
  • ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని వెల్లడి
  • ట్రస్టు ఆనవాయితీలకు అడ్డురాకూడదని స్పష్టీకరణ
  • విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే మాన్సాస్ ట్రస్టు భూములపై దృష్టి కేంద్రీకరించినట్టు అనిపిస్తోందని అన్నారు. తాను ఎప్పుడు మాట్లాడినా గానీ జైలుకు పంపిస్తామంటున్నారని, బెయిల్ పై బయటికి వచ్చిన ఈ పెద్దలకు జైలు అంటే బాగా ఇష్టమేమో అని వ్యాఖ్యానించారు. వారి మాటలు వింటుంటే అలాగే భావించాల్సి వస్తోందని తెలిపారు.

ఇక ట్రస్టు అంశాలపై స్పందిస్తూ, ట్రస్టు పాలకమండలి సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరు కాదన్నారు? అని ప్రశ్నించారు. సర్కారు ఏర్పాటు చేసే ట్రస్టు పాలకమండలికి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, మాన్సాస్ చైర్మన్ గా, పాలకమండలి సభ్యులుగా ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

అయితే ట్రస్టుకు కొన్ని ఆనవాయితీలు ఉన్నాయని, వాటి విషయంలో అడ్డురాకుండా ఉంటే చాలని అభిప్రాయపడ్డారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Ashok Gajapathi Raju
MANSAS Trust
YSRCP
Andhra Pradesh

More Telugu News